ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలోని సీబీఐ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు సమయంలో చిదంబరం సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది. అందుకే అయిదు రోజుల కస్టడీ కావాలని సీబీఐ ఇవాళ కోర్టును కోరింది.
సుప్రీంకోర్టు కూడా చిదంబరం పిటిషన్ను ఈ రోజు స్వీకరించలేదు. ఆయన వేసిన పిటిషన్ అసలు జాబితాలోనే లేదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఢిల్లీ కోర్టు తాజా ఆదేశాలతో ఆగస్టు 30వ తేదీ వరకు చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. ఎఫ్ఐపీబీ రూల్స్ గురించి ప్రశ్నలు వేసినప్పుడు, చిదంబరం నెమ్మదిగా స్పందిస్తున్నారని లాయర్ తుషార్ మెహతా తెలిపారు.