telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో ఒకే రోజు 300 పెళ్లిళ్లు

శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లి భాజాలు మోగుతాయి. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముళ్ల బంధంతో.. ఏడడుగులు వేసి 300 జంటలు ఒక్కటయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణం వధూవరులు, వారిబంధుమిత్రులతో కోలాహలంగా మారింది.

గతేడాది కరోనా విజృంభణ తరువాత ఇంత భారీగా వివాహాలు జరగడం ఇదే తొలిసారి. అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపంలోని 12 వివాహ వేదికల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది. వివాహాలు చేసుకున్న వారికి కల్యాణ మండపంతో పాటు అవసరమైన సామగ్రిని దాత మట్టే శ్రీనివాస్‌ ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహూకరించారు.

కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో కల్యాణ మండపాలు కళ కళ లాడుతున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైన శ్రావణ మాసంలో ప్రతియేటా వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. మార్కెట్‌లో వస్త్రాలు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లోని బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి.

Related posts