కేంద్ర కేబినెట్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తితో సహా ప్రస్తుతమున్న 31 మంది న్యాయమూర్తుల సంఖ్యను 34కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టులో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ రూపొందించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన వెంటనే ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుందని జవదేకర్ తెలిపారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రభుత్వం అనుమతించిన 31 మంది న్యాయమూర్తులతో పూర్తి స్థాయిలో నడుస్తోంది. అంతకుముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించిన 1956 నాటి చట్టాన్ని 2009 లో సవరించారు. ఈ సవరణ మేరకు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి 25 మందిగా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 30కి పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొ య్ ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టులో 59,33 1 కేసులు పెండింగ్లో ఉన్నట్లు సభలో తాజాగా వెల్లడించారు.