టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో భూవివాదం కేసులో వెంకటాచలం పోలీసులు మొదటి నిందితుడిగా చేర్చి ప్రైవేట్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జారీ చేసిన విచారణ నోటీసులను తీసుకున్న సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా సోమిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసును అంటించి వచ్చారు. మొత్తం మీద సోమిరెడ్డి అదృశ్యం కావడంతో రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చి విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. దీంతో వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.