తనకు చినజీయర్ స్వామితో పరిచయం సిద్ధిపేటలోఏర్పడిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద జీయర్ స్వామి వారి జీవిత చరిత్రను తెలిపే ‘సత్య సంకల్ప’ గ్రంథావిష్కరణ హైదరాబాద్ శివారులోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1986, 87 ప్రాంతంలో సిద్ధిపేటలో ఆయన బ్రహ్మయజ్ఞం చేయాలని తలపెట్టగా, స్థానికులు తనను సంప్రదించారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
అప్పటికి చినజీయర్ స్వామితో తనకు పరిచయం లేదని, అయితే ఆయన ఎక్కడ బస చేయాలన్న విషయం చర్చకు రాగా తన ఇంట్లోనే ఆయనకు బస ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపానని తెలిపారు. చినజీయర్ స్వామి అంతటివాడు తన ఇంట్లో ఉంటానంటే అంతకంటే కావాల్సిందేముందని సంబరపడిపోయానని వెల్లడించారు. తన ఇంట్లో ఉండేందుకు చినజీయర్ స్వామి అనుగ్రహిస్తే ఎంతో ఆనందం కలిగిందని కేసీఆర్ వివరించారు.