కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో విధానసభలో కూటమికి బలం తగ్గింది. ఈ నేపథ్యంలో, బలనిరూపణ అంశం కీలకంగా మారింది. దీనిపై బీజేపీ నేత సదానందగౌడ మాట్లాడుతూ కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే యడ్యూరప్పే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో తమదే అతిపెద్ద పార్టీ అని వెల్లడించారు. అయితే ఎవర్ని ఆహ్వానించాలనేది గవర్నర్ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అన్నారు.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ కు 78 మంది సభ్యులు ఉండగా, జేడీఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణ మెజారిటీకి 113 మంది సభ్యులు అవసరం కావడంతో, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాయి. ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ తగ్గింది.