టీడీపీఅధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ లో ఘాటు విమర్శలు చేశారు.ప్రజల తీర్పుకు వక్ర భాష్యాలు చెప్పి బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఎన్నికల ఓటమిపై జరిపే సమీక్షల్లో కూడా చంద్రబాబు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని విజయ సాయిరెడ్డి విమర్శించారు.
గతంలో పరాజయం పాలైనప్పుడు కారణాలు తెలిసేవని, ఈసారి ఎందుకు ఓడామో అర్థం కావడం లేదని బాబు అనడం చూస్తే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీల నేతలంతా కారణాలను విశ్లేషించుకుని వైఫల్యాలను సరిదిద్దుకుంటామని ప్రకటించారు. చంద్రబాబు మాత్రం ఇంకా వింత వాదనలకు దిగుతున్నారు. దోపిడీలకు పాల్పడిన దొంగ పోలీసులు తనను ఎందుకు అరెస్టు చేశారో తెలియడం లేదన్నట్లుగా చంద్రబాబు వాలకం ఉందని మండిపడ్డారు.