మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా నాగార్జున హీరోగా ప్రస్తుతం చిలసౌ ఫేం రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో “మన్మథుడు-2” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిరణ్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. ఫన్ రైడ్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందింది.
అయితే ఈ చిత్ర టీజర్ని బట్టి చూస్తుంటే మన్మథుడు 2 చిత్రం ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ ప్రెటీ మోయి టా మెయిన్ (ప్రపంచవ్యాప్తంగా ఐ డూ పేరుతో విడుదలైంది) మాదిరిగా ఉందని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్రెంచ్ చిత్రంలోను మధ్య వయస్కుడైన వ్యక్తి తన అక్కలని, తల్లిని పెళ్లి చేయమని వేధిస్తుంటాడు. మన్మథుడు 2 కూడా అదే లైన్తో తెరకెక్కుతోందని భావిస్తున్నారు. మరి దీనిపై దర్శకుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల కానుంది.