తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో టిఆర్ఎస్ అధిష్ఠానం వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని ఒక ఉప ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం అనేది చట్టపరంగా చెల్లుతుందా? అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. టిఆర్ఎస్ అధిష్ఠానం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది.
రాజ్యాంగాన్ని నమ్మేవారు తలదించుకునే విధంగా ఉంది. అంపైర్ ను అడ్డంపెట్టుకుని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలవాలి అనుకున్నట్లు ఉందన్నారు. అసెంబ్లీలో మంది బలం అడ్డం పెట్టుకుని టిఆర్ఎస్ అరాచకంగా వ్యవహరిస్తున్న తీరు ఒక దుస్సంప్రదాయానికి నాంది పలుకుతోంది. ఈ పరిణామాలు టీఆర్ఎస్ మెడకు ఉచ్చు బిగుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు టిఆర్ఎస్ నేతలు అరిచి గీపెట్టినా వినే నాథుడు కూడా కరువు అవుతాడని విజయశాంతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.