ఏపీలో ఇంకా ప్రధాన పార్టీలలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కడప సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇద్దరు టీడీపీ నాయకులు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరి అడుగులు వైసీపీ వైపే అని రాజకీయవర్గాలు ఊహించినట్టే వీరిద్దరూ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సాయిప్రతాప్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్కు అత్యంత సన్నిహితుడు. అనుకోని పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో రాజంపేట ఎంపీ టికెట్టు ఆశించిన ఆయనకు అధిష్ఠానం మొండిచెయ్యి చూపింది. దీనితో ఆయన పార్టీ మారడం ఖాయం అన్న మాటలు అప్పుడే వినిపించాయి. అనుకున్నట్టే కొద్దిరోజుల క్రితం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ గూటిలో చేరాలని నిర్ణయించారు.
అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఎన్నికల ముందే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అమలాపురం ఎంపీ టికెట్టు ఆశించి ఆ పార్టీలో చేరిన హర్షకుమార్ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. ఆ స్థానాన్ని లోక్సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి.బాయోగి కొడుకు హరీష్కు కేటాయించారు. దీనితో అసంతృప్తికి గురైన హర్షకుమార్ వెంటనే టీడీపీకి రాంరాం చెప్పేశారు. ఈయన కూడా వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. హర్షకుమార్తో పాటు ఆయన కొడుకు శ్రీహర్ష కూడా వైసీపీలో చేరనున్నారు.
కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా