దేశంలో ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో .. తాగి నామినేషన్ పత్రాలు సమర్పించబోయిన అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బీహార్లో సంచలనమైంది. నామినేషన్ వేయడానికి వచ్చిన సదరు వ్యక్తి బాగా తాగి ఉండడమే అందుకు కారణం. పూర్తిగా మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో మందుకొట్టి నామినేషన్ వేసేందుకు రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల బరిలోకి 40 ఏళ్ల రాజీవ్ కుమార్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా దిగాలని భావించాడు. అనుకున్నదే తడవుగా నామినేషన్ పత్రాలతో ప్రత్యక్షమయ్యాడు. అయితే, అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వచ్చారా? అన్న పోలీసుల ప్రశ్నకు సింగ్ ఏమాత్రం తొణక్కుండా ‘అవును’ అని సమాధానం ఇచ్చాడు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న అతడిని నామినేషన్ దాఖలు చేసిన తర్వాతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
ఎన్నికల దెబ్బకి, మద్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో కూడా విచ్చలవిడిగా మందు దొరకడం విశేషం. ఏమైనా భారతదేశంలో ఎన్నికలంటే.. మద్యం-నగదు లేకుండా జరగడం సాధ్యం కాదని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇందులో వీటిని తీసుకుంటున్న ఓటరుది మొదటి తప్పైతే, రెండవ తప్పు జరగటానికి ఇక అవకాశం లేనిదెక్కడ. ఎందుకంటె, ఎక్కడైనా యజమాని నీచంగా ప్రవర్తిస్తూ, పనివాడిని పవిత్రంగా ఉండమంటే ఉంటాడా.. ఏంటి.. ? ఇది అంతే. ఓటర్ మారాలి.. దానితో అన్ని మారతాయి.
ఇక ఒడిశాలో అయితే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తిని దుండగులు విచక్షణారహితంగా నరికి చంపిన ఘటన సంచలనం రేపింది. ఎన్నికల కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటువంటి చెదురుమొదురు ఘటనలు ఎన్నికల సంఘానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.