బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి మరోసారి మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేవలం ప్రకటనల కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.3,044 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఈ మొత్తం నగదుతో ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రాల్లోని ప్రతీగ్రామంలో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని వ్యాఖ్యానించారు. ఈరోజు ట్విట్టర్ లో మోదీపై మాయావతి విమర్శల వర్షం కురిపించారు.
ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం మభ్య పెడుతోందని మండిపడ్డారు. అందులో భాగంగా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లిస్తోందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 80 స్థానాలకు గానూ బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరో మూడు స్థానాలను రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించారు. మిగిలిన అమేథి(రాహుల్ గాంధీ), రాయ్ బరేలీ(సోనియా గాంధీ) సీట్లలో పోటీ చేయకూడదని నిర్ణయించారు.