telugu navyamedia
National రాజకీయ వార్తలు

సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలకు విమాన సర్వీసుల రద్దు: మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా వేలాది విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

సోమవారం నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన లోక్‌సభలో ఈ వివరాలను వెల్లడించారు.

ఈ సంక్షోభం వల్ల భారత విమానయాన సంస్థలు 4,335 విమానాలను, విదేశీ సంస్థలు 1,187 విమానాలను రద్దు చేశాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకే ప్రభుత్వం, విమానయాన సంస్థలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయన్నారు.

“సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో గగనతలాన్ని మూసివేసినప్పుడు అక్కడ విమానాలు నడపాల్సిన అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

విమానాల రద్దుతో అంతరాయం ఏర్పడినప్పటికీ, ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా దాదాపు 2,19,780 మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు మంత్రి తెలిపారు.

భారత విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని వివరించారు.

ఆయా ప్రాంతాల్లో గగనతలం తిరిగి తెరుచుకున్న తర్వాతే విమాన సర్వీసులు సాధారణ స్థితికి వస్తాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Related posts