తెలుగు రాష్ట్రాలకు పదేళ్లు నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పటికీ చేసిందేమీ లేదనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ ఆయన గుళ్లు,గోపురాలకు తిరగడానికే పనికి వస్తారని దుయ్యబట్టారు. ఆయన తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన నిలబడటానికి సరిగ్గా ఫిట్ అవుతారని ఎద్దేవా చేశారు.
మర్రి చెన్నారెడ్డి రాజస్థాన్ గవర్నర్ గా ఎలా వ్యవహరించారో తాను చూశానని వీహెచ్ చెప్పారు. ఈఎస్ఎల్ నరసింహన్ కు తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన చోటు ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబుకు రేపు తాను లేఖ రాస్తానని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలవడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పూర్తిగా గర్వం పెరిగిపోయిందని ఈ గర్వాన్ని పెద్దమ్మ తల్లి తప్పనిసరిగా అణచివేస్తోందని వీహెచ్ జోస్యం చెప్పారు.