ప్రముఖ నిర్మాత ఎమ్ .అర్జునరాజు ఈరోజు హైదరాబాద్ లో మరణించారు . ఆయన వయసు 80 సంవత్సరాలు . ఆయనకు భార్య, పిల్లలు వున్నారు .
అర్జునరాజు గారు తన మిత్రుడు శివరారాజుతో కలసి 1979లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్ .టి .రామారావు, శ్రీదేవి జంటగా ‘వేటగాడు ‘ అనే చిత్రాన్ని నిర్మించారు . ఆ సినిమా అనూహ్యమైన విజయమా సాధించింది.
ఆ తరువాత 1981లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే ‘కొండవీటి సింహం’ అనే చిత్రాన్ని రూపొందించారు . ఈ సినిమాలో ఎన్ .టి .రామారావు , శ్రీదేవి కలసి నటించారు . ఇది కూడా ఘన విజయం సాధించింది.
చిరంజీవితో ‘జేబుదొంగ ‘, శ్రీకాంత్ తో ‘మా నాన్నకు పెళ్లి’ , ఎస్ .వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘జాబిలీ’, నాగార్జునతో ‘బావ నచ్చాడు ‘, జగపతి బాబు తో ‘జగపతి ‘ అల్లరి నరేష్ తో ‘మా అల్లుడు వెరీ గుడ్ ‘ చిత్రాలను నిర్మించారు .
హిందీలో ధర్మేంద్రతో ‘జానీ దోస్తు ‘, జితేంద్రతో ‘ ఫర్జ్ ఔర్ కానున్ ‘ చిత్రాలను రూపొందించారు .
తెలుగు సినిమా రంగంలో మంతెన అర్జునరాజు చాలా స్టయిలిష్ ప్రొడ్యూసర్ . మహానటుడు ఎన్ .టి .రామారావు , నటి శ్రీదేవికి అత్యంత ఇష్టమైన నిర్మాత .
శ్రీదేవి హిందీ రంగంలోకి వెళ్లిన తరువాత ఆమె కాల్ షీట్స్ కావాలంటే అర్జునరాజు గారిని సంప్రదించేవారు.
సినిమా అంటే ఆయనకు అమితమైన ఇష్టం . సినిమా నిర్మాణంలో రాజీపడటం ఆయనకు తెలియదు. రామోజీ ఫిలిం సిటీ లో నిర్మించిన మొదటి సినిమా ఇవివి దర్శకత్వంలో వచ్చిన ‘మానాన్నకు పెళ్లి ‘ కావడం విశేషం .
అర్జునరాజు గత కొంతకాలంగా అస్వస్తులుగా వున్నారు . శుక్రవారం రోజు ఆయన ఇహలోక యాత్ర ముగించారు .

