హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు సీఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది.
ఈ కారిడార్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు.
తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్డీఏ గుండా వెళ్తుంది.
ఇటు రాయలసీమ వాసులకు కూడా ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్-బెంగళూరు కారిడార్ను రూపొందించారు. 576.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత నేషనల్ హైవేకి సమాంతరంగా సాగుతుంది.
ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం స్టేషన్లతో పాటు, శ్రీ సత్యసాయి జిల్లా దుద్దేబండ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు.
ఈ కారిడార్లో ఏపీలో 263.3 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది.
ఈ రెండు కారిడార్లతో పాటు, ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు-చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు చతుర్భుజి ఏర్పడుతుంది.
దీనివల్ల ఈ మహానగరాల మధ్య రెండు గంటలు ప్రయాణ సమయం తగ్గనుంది. ఇది వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…