కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హుజురాబాద్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శామీర్పేట్లోని ఈటెల రాజేందర్ ఇంటికి ఇవాళ(శనివారం) కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడారు. హుజురాబాద్ తెలంగాణ ప్రతికకు అడ్డా అని ఉద్ఘాటించారు.
ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.
అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని ఉద్గాటించారు.
తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. దక్షిణ భారతదేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం పెట్టారని గుర్తుచేశారు ఎంపీ ఈటెల రాజేందర్.
శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీలో అన్నిరకాల అంశాలని పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని.. తనకు తెలియని వారు లేరని… బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానని గుర్తుచేశారు.
వీరుడు ఎక్కడ భయపడడు. హుజురాబాద్ గడ్డ మీద తన ప్రతి అనుచరుడు ఉంటారని వెల్లడించారు. తన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు కూడా ఉంటారని తెలిపారు.
దేశ ప్రధాని మోదీ వ్యక్తుల కోసం కాకుండా.. వ్యవస్థ నిర్మాణం కోసం పని చేస్తున్నారని నొక్కిచెప్పారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో కొంతమంది ఉంటారని.. వారు ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పని అని విమర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్.
కచ్చితంగా హుజురాబాద్ వస్తా.. మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. తనను ఏడుసార్లు గెలిపించారని… ఎవరికీ భయపడేది లేదని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
రాజకీయాల్లో చిన్న మనస్కులు, కురుసా మనస్తత్వం ఉన్న వాళ్లు ఉంటారని తెలిపారు. వాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటారని.. అలాంటిది వారితో యుద్ధం చేయడం కష్టమే కానీ ఎదురెళ్లి నిలబడాలని చెప్పుకొచ్చారు.
ఇక నుంచి హుజురాబాద్లో ప్రతి మండలానికి ఒక కార్యాలయం ఉంటుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ,కేసీఆర్ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని గుర్తుచేశారు.
సముద్రంలో తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. తన లాంటి వాళ్లు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుందని.. తాను ప్రజల నుంచి వచ్చిన వాడినని, ప్రజలే తనకు న్యాయ నిర్ణేతలని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.