తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 16 సామూహిక జాతీయ గీతాలాపనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉద్వేగభరితంగా జరిగింది. ప్రజలంతా ఒకేచోట ఏకమై జనగణమన గీతాన్ని ఆలపించారు.
ఆబిడ్స్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రయివేటు సంస్థలు తదితర ప్రదేశాల్లో ఈకార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
అలాగే రహదారులపై ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా సరిగ్గా 11.30కి ఎక్కడికక్కడే నిలబడి సామూహిక జనగణమన ఆలపించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం వేడుకగా, ఘనంగా జరిగింది. ఆ సమయంలో మెట్రో రైలును కూడా అధికారులు నిలిపివేశారు. అన్ని జంక్షన్లలోనూ జాతీయ గీతం వినిపించేలా ప్రత్యేకంగా స్పీకర్లను పోలీసులు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఒక నిమిషం పాటు రెడ్ సిగ్నల్ పడింది. జాతీయ గీతం పూర్తయిన తర్వాత తిరిగి బయలుదేరాయి.
ఈ నెల 22వ తేదీ వరకూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో జరగనున్నాయి. 22న ముగింపు సందర్భంగా ఎల్బీ స్టేడీయంలో ర్యాలీ జరగనుంది.