*హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
*కాంగ్రెస్ నేత కుమార్తె తనియా మృతి
*శంషాబాద్ లో బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తుండగా ప్రమాదం
*నేడు తనియా అంత్యక్రియలు
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు.
శంషాబాద్ లో ఓ పార్టీకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. శంషాబాద్లో శాతంరాయి వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. కారులో తానియాతో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం, ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.
ఫిరోజ్ ఖాన్ టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేతగా ఉన్నారు. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కుమార్తె తానియా బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు.