ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్య రద్దు అయ్యింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కారణంగా తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు కోలుకోలేని తీవ్రంగా నష్టపోయారు. వందలాది హెక్టార్లల్లో పలు పంటలకు నష్టం జరిగింది. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఈ విషయంపై సోమవారం జరిగిన తెలంగాణ కేబినేట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఈ సమావేశం అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న రైతుల పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. పలువురు ఉన్నతాధికారులు ఈ పర్యటనను కొనసాగించనున్నారని తెలిసింది. నష్టపోయిన రైతులను స్వయంగా కలవడంతోపాటు.. పంట పోలాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

