వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో నిన్న జరిగిన అమరావతి రైతులు నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ, వైసీపీ ఎంపీ రఘరామ పాల్గొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ముక్తకంఠంతో నినదించాయి.
అయితే ఈ సభలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం హైలెట్ అయింది.
వైసీపీ తరఫున గెలిచినా.. ఆ పార్టీకే గుదిబండగా మారిన రఘురామ, చంద్రబాబు వేదిక పంచుకోవడంపై మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి శని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద అంత అభిమానం వుంటే.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ టికెట్పై గెలిచిన ఎంపీ రఘరామకృష్ణంరాజు ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని నిప్పులు చెరిగారు.
సభలో విపక్ష నేతలు మాట్లాడే తీరు విడ్డూరంగా ఉందని, రాజదాని అమరావతిలోనే ఉంటుందని ప్రధాని మోడీ ఎప్పుడూ చెప్పలేదని, బహుశా సీపీఐ రామకృష్ణకు ఫోన్లో చెప్పారేమో తనకు తెలియదన్నారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్కు ప్రధాని మోడీ ఎలాంటి ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్ళలో కరకట్టపై రోడ్డే వేయలేకపోయారని, రాజధానిని గ్రాఫిక్లో చూపించి మోసం చేయడం వల్లే ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారని మండిపడ్డారు.