ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని వైసీపీ నేత, ఏపీఐఐసీ చైర్మన్ రోజా అన్నారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేని చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోడెల శివప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు వంటి కీచకుల నుంచి విముక్తి పొందినందుకు పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలతో జగన్ ముందుకు వెళుతున్నారని చెప్పారు.
అమ్మఒడి, ఫీజు రియంబర్స్ మెంట్, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులకు మద్దతుగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో రైతుబాంధవుడిగా నిలిచేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రోజా తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉంటే కృష్ణా జిల్లాలో వరదలంటూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాలను టీడీపీ అవసరం లేకుండా పెడుతున్నారని విమర్శించారు. యరపతినేని, కోడెల, బోండా ఉమ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు అరాచకాలకు ఎంతోమంది బలైతే చంద్రబాబు పునరావాస కేంద్రాలు పెట్టలేదని రోజా ప్రశ్నించారు.