చారిత్రక నేపథ్యంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా… తెలంగాణ ప్రాంతానికిచెందిన కొమురం భీమ్… ఆంధ్రాప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజుల పోరాటోధ్యమంలో ఏకమైన సన్నివేశం ప్రేక్షకలోకాన్ని ఉత్తేజింపజేసింది. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన రౌద్రం…రణం.. రుధిరం.. సినిమానుంచి విడుదలైన ట్రైలర్ కథానాయకులతో అభిమానులకు పూనకాలు తెప్పించారు.
కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించి RRR సినిమాట్రైలర్ ఆవిష్కరించి.. సామాజిక మాధ్యమాల్లో విడుదలచేశారు. ట్రైలర్ ఆద్యంతం అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన విడుదలచేయాలని సినిమా యూనిట్ కసరత్తు చేస్తోంది.
సినిమా రూపకల్పనలో తారక్.. చరణ్ అభిమానుల అంచనాలకు మించి ఆలోచిస్తూ…. అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఆలోచనతో దర్శకధీరుడు రాజమౌళి అడుగులేస్తున్నాడు. తాజాగా విడుదలచేసిన ట్రైలర్ ను చూస్తే రాజమౌళి ఆలోచనాతీరుకు అద్ధం పడుతోంది. ఈ ట్రైలర్ లో రాజమౌళి సినిమా మూల కథను టూకీగా… చెప్పారు. “అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్ నిజ జీవితంలో ఒకరినొకరు కలవలేదు. అయితే వారిద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయి. వారిద్దరూ యుక్త వయసులోనే ఇంటినుంచి బయటకు వచ్చారు. బ్రిటిష్.. నిజాం పాలన కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇద్దరి జీవితంలో జరిగిన పలు ముఖ్యమైన ఘట్టాలను కలిపి RRR రూపొందించారు. 1920 లో ఇద్దరు స్నేహితులు చెడుకు వ్యతిరేకంగా చేసినపోరాటమే RRR మూల కథగా జక్కన్న వెల్లడించారు.
రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరూ ఒకరినొకరు కలిపే సన్నివేశాన్ని ప్రెజెంట్ చెయ్యడం ప్రేక్షకులను ఫిదా చేసింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఇద్దరు పెద్ద స్టార్ హీరోలను ఒక సినిమాలో నటింపజేయడంలో స్పైడర్ మేన్.. సూపర్ మేన్ కలిస్తే ఎలా ఉంటుందో… అలా థియేటర్లు దద్దరిల్లేలా సన్నివేశాలను చిత్రీకరించారు. అందుకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రేక్షక అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
తారక్.. రామ్ చరణ్ ఇద్దరి కుటుంబాల మధ్యలో ఎప్పటి నుంచో సినిమాల పరంగా పోటీ ఉంది. అయితే వారిద్దరూ మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరితోనూ కలిపి సినిమాను తెరకెక్కించడంలో రాజమౌళి తన కెరీర్ మరో అద్భుతమైన సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నారు.
విడుదలచేసిన ట్రైలర్లో సన్నివేశాలు, డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సినీ ప్రముఖుల్లోనూ చర్చనీయాంశమైంది. పులిగాండ్రింపుతో సమానంగా కొమురంభీమ్ అరుపు సన్నివేశం గగుర్పాటుకు గురిచేసింది. ఇద్దరి మధ్య మైత్రీ సన్నివేశం అభిమానుల్ని ఉర్రూతలూగించింది.
‘పాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న.. గర్వంతో గీ మన్నులో కలిసిపోతనే’అంటూ తెలంగాణ యాసలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ .. ‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి.
కొమురమ్ భీమ్గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ నటి ఆలియాభట్ సీతపాత్రలో నటించగా, ఎన్టీఆర్ కు జోడీ హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. సినిమా ఆద్యంతం సందర్భోచితంగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్దవరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి థియేటర్లలో సంక్రాంతి కానుకగా రాజమౌళి సినిమా 2022 జనవరి 7న ప్రేక్షకులను అలరించడమేకాదు… సినిమా రికార్డుల్ని తిరగరాయబోతోంది.