కరోనా విలయతాండవంలో సినీ పరిశ్రమ బాగా నష్టపోయింది. నాలుగో దశ లాక్డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు సడలింపులతో కూడిన మినహాయింపు ఇవ్వడంతో.. సినీ రంగం తరఫున మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పెద్దలంతా కలిసి తమ తమ షూటింగ్స్కి కూడా అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ని అభ్యర్థించారు. ఈ మేరకు సినిమా షూటింగ్స్ పున:ప్రారంభించుకోవడానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కొద్దిమందితో సామాజిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా షూటింగ్లు చేసుకోవచ్చని తెలిపారు. తక్కువ మందితో, ఇండోర్లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని.. ఆ తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని కేసీఆర్ చెప్పారు. కరోనా కల్లోలంలో కార్మికులను ఆదుకోవడంతో పాటు చిత్రసీమలో సమస్యలు, షూటింగ్స్ పున:ప్రారంభించడం, థియేటర్లు రీఓపెనింగ్ వంటి వాటిపై చొరవ తీసుకున్న వారిలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకు స్పెషల్ థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ”చిరంజీవి సర్.. మీరు తీసుకున్న చొరవ చాలా గొప్పది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇండస్ట్రీలోని పెద్దలందరూ కలిసి సినిమా భవిష్యత్తు కోసం తపించడం హర్షించదగ్గ విషయం. నేను కూడా త్వరలోనే ముంబై నుంచి వస్తాను. వచ్చాక పూర్తి స్థాయిలో మీతోపాటే ఉంటాను. లవ్యూ ఆల్” అని ట్వీట్ చేశారు పూరి.
Sir @KChiruTweets Great initiative by you n all big people of TFI showing concern towards our shoot planning n future of our cinema family, taken forward with utmost care in this corona crisis . I shall be back from Mumbai very soon and give my full participation. love u all🙏🏽🙏🏽
— PURIJAGAN (@purijagan) May 22, 2020