మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమరావతి వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికోసం అలుపెరుగని పోరాటం చేసిన రైతులు సాధించిన విజయమని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వాలు ప్రజాహితాన్ని కాంక్షించాలేతప్ప… వ్యక్తిగత కక్షసాధింపులకు పాల్పడకూడదని ఈ ఘటన రుజువుచేసిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
అధికారం ఇచ్చింది ప్రజలు, ప్రజల ఆలోచనలు, ఆశలకు అనుగుణంగా పాలకులు సేవలందించాలేగానీ, అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరిస్తే… న్యాయస్థానాలు ధర్మాన్ని పరిరక్షిస్తాయని అభిప్రాయపడ్డారు.
706 రోజులుగా అవిశ్రాంతపోరాటం చేస్తున్న రైతులకు పాదాభివందనం చేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విజయం చాలా గొప్పదని పేర్కొన్నారు.
న్యాయ స్థానంలో పోరాడుతూనే… భగవంతుని పట్ల విశ్వాసంతో న్యాయ స్థానం టు దేవస్థానంపేరుతో మహిళలు, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందన్నారు.