ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. అమరావతి రాజధాని కొనసాగింపుపై స్పష్టత వచ్చింది. మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో సాగుతున్న రోజువారి విచారణలో అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ ప్రకటన చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులుగా విభజించి పాలించాలని భావించారు. విశాఖ పట్టణాన్ని కార్యనిర్వాహకరాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా నిర్వహించాలని సంకల్పించారు. దీంతో సీఆర్డీయే క్యాపిటల్ రీజినల్ డెవలప్ మెంట్ అథారిటీని రద్దుచేసి, మూడు రాజధానుల బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేత ఆర్డినెన్స్ ఆమోదింప జేశారు.
దీంతో ప్రజాసంఘాలు, అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. అలుపెరుగని పోరాటంతో మహిళలు, రైతులు ఉద్యమించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టారు. మరో వారం రోజుల్లో మహాపాదయాత్ర తిరుమల చేరుకోబోతోంది. తిరుమలకు చేరుకునే లోపే అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు ఉద్యమించి సాధించిన విజయమని ప్రజాసంఘాలు, అమరావతి పరిరక్షణ సమితి, మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

