బయో బబుల్లోకి కరోనా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మెగా టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్లకు గాను.. మంగళవారం లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. ఒకవేళ ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులు జరగకపోతే.. బీసీసీఐ 2500 కోట్లు నష్టపోనుందని స్వయంగా సౌరవ్ గంగూలీనే తెలిపారు.ఇక ఐపీఎల్ 2021 మిగతా సీజన్ నిర్వహణ కోసం ఇప్పటివరకూ యూఏఈ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటీపడ్డాయి. తాజాగా శ్రీలంక కూడా రేసులో నిలిచింది. భారత్లో ఇదే పరిస్థితి ఉండి టీ20 ప్రపంచకప్ను తరలించాల్సి వస్తే.. బీసీసీఐ కచ్చితంగా యూఏఈలోనే మెగా టోర్నీని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎదుకంటే ఇప్పటికే అక్కడ ఐపీఎల్ 2020 సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 కూడా అక్కడే జరిగే వీలుంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఐపీఎల్, ప్రపంచకప్ కోసం కోహ్లీసేన నేరుగా యూఏఈ చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇంగ్లండ్లోనే ఐపీఎల్ 2021 నిర్వహించాలని భావిస్తే.. భారత ఆటగాళ్లు అక్కడే ఉంటారు కాబట్టి మిగతా క్రికెటర్లను అక్కడికి తరలిస్తారు. అయితే యూఏఈతో పోలిస్తే.. ఇంగ్లండ్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది బీసీసీఐకి పెద్ద బొక్కే అని చెప్పొచ్చు. ఇక ఐపీఎల్ ఆతిథ్యం కోసం ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బీసీసీఐ వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశాలు దాదాపు లేవు.
previous post
అసభ్య పదజాలంతో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు