భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనా సోకిన ఆరు రోజుల తర్వాత తాను వైద్య సిబ్బంది సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు ట్వీట్ చేసాడు. అయితే దీని పై పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ స్పందిస్తూ… ‘సచిన్.. 16 ఏళ్ల వయసులోనే నువ్వు ప్రపంచ అత్యుత్తమ బౌలర్లతో పోరాటం చేసిన యోధుడివి. నువ్వు కచ్చితంగా కొవిడ్-19ను సిక్స్ కొట్టగలవు. త్వరగా కోలుకో మాస్టర్. భారత్ 2011 వరల్డ్కప్ విజయాన్ని నువ్వు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో జరుపుకుంటావని ఆశిస్తున్నా. అలా చేస్తే నాకు కూడా ఓ ఫొటో పంపించు’అని వసీం అక్రమ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే మొదట వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరుతున్నానని సచిన్ ట్వీట్ చేశాడు. ‘నేను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు, వారు చూపిస్తున్న ప్రేమా ఆప్యాయతలకు ధన్యవాదాలు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తా. కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నా’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.
previous post
next post