telugu navyamedia
Uncategorized

జూన్ 26 నుంచి వనకాలానికి రైతుబంధు నిధులు: సీఎం కేసీఆర్

వానకాలం పంట పెట్టుబడి ‘రైతుబంధు’ నిధులను జూన్ 26 నుండి విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖా మంత్రి శ్రీ హరీష్ రావును, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావును సిఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, పట్టాలు పొందిన రైతులకు రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు

తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటసాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకోసం ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు అని స్పష్టం చేశారు. “పైసలు పోయినా ఫర్వాలేదు పంటలు కాపాడాలని’ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రుతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యల కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ డా. బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. నిరంతరాయంగా తాగునీటి కోసం ముందస్తు చర్యలు: జూలై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి కోసం నీటి విడుదలకు కొద్ది రోజుల పాటు విరామం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటిని నింపి ఉంచాలని ఆదేశం: జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలను, మిషన్ భగీరథ అవసరాలను సంబంధిత అధికారుల నుండి సీఎం ఆరా తీశారు. జూలై మొదటి వారంలో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తదితర అంశాలను సమీక్షించుకొని, పరిస్థితులకు అనుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ వివరాలను సిఎం ఆరా తీశారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ జలాశయంలో మూడు టిఎంసిలకు గాను 0.69 టిఎంసిల నీటి నిల్వ మాత్రమే ఉన్నాయని ఇంజనీర్లు తెలుపగా, రంగనాయక సాగర్ కు రెండు టిఎంసిల నీటిని మిడ్ మానేరు జలాశయం నుండి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులను సిఎం ఆదేశించారు. తద్వారా రంగనాయక సాగర్ జలాశయం కింద ఆయకట్టుకు వానాకాలం పంటకు నీరందించడానికి వీలవుతుందని అన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 4.95 టిఎంసిల నీటి నిల్వలు ఆగష్టు చివరి వరకు 3 తడులకు సరిపోతాయని, ఆ తర్వాత మరో మూడు తడులకు 5 టిఎంసిలు అవసరమని ఇంజనీర్లు సూచించారు. దీని కోసం ఆగష్టులో 5 టిఎంసిలను కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాం సాగర్ కు తరలించాలని సమావేశం నిర్ణయించింది. ఆగష్టు నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించుకొని, కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టిఎంసిల నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం మల్లన్నసాగర్ లో మరో 10 టిఎంసిలు నింపాలని నిర్ణయం జరిగింది. వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ ఫ్లో ఆగిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలుంటాయి. రెండో పంట అవసరాల కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నింపి పెట్టుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయం పై ఒక ఆపరేషన్ మాన్యువల్ తయారు చేయాలని సాగునీటి అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి సాగునీటి శాఖ సన్నద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి సూచించారు.

Related posts