ఐపీఎల్ ఎవరిని ఎప్పుడు స్టార్ లను చేస్తుందో చెప్పడం కష్టం.. ఆట ఎప్పుడు ఎవరివైపు తిరుగుతుందో కూడా చెప్పడం కష్టం. తాజాగా ఇదే మరోసారి నిరూపణ అయ్యింది. గత ఆసీస్ సిరీస్ నాలుగో వన్డేలో భారత్ ఓటమికి కారకుడై పంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రదర్శనతో రాబోయే వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టతరమని భావించిన తరుణంలో ఐపీఎల్లో వీరవిహారం చేశాడు. ముంబయి ఇండియన్స్తో ఆడిన మొదటి మ్యాచ్లోనే చుక్కలు చూపించి తన సత్తా ఎంటో చాటిచెప్పాడు.
ముంబయి బౌలర్లను తుత్తునియలు చేస్తూ.. 27 బంతుల్లో 78(7×4, 7×6) పరుగులు చేశాడు. గతరాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రిషభ్పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పంత్ మార్క్ బ్యాటింగ్తో 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి 37 పరుగుల దూరంలో ఓటమిపాలైంది.
మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘జట్టు అవసరాలను బట్టి నేను ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం. ప్రతీరోజూ కొత్త మెళకువలు నేర్చుకుంటా. మా జట్టు గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. పరిస్థితులను బట్టి నేను బ్యాటింగ్ శైలిని మార్చుకుంటా. అలాగే ఈసారి రన్రేట్ పెంచాలనుకున్నా. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. టీ20ల్లో ఏదైనా కొత్తగా చెయ్యాలి. ప్రత్యర్థి అవకాశం తీసుకునేలోపే మనమే అవకాశం తీసుకోవాలి’ అని వెల్లడించాడు.
ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్ పంజాబ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.