రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇటీవల తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయనే స్వయంగా తన ట్విట్టర్లో తెలిపాడు. విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పవన్ హాజరు కావల్సి ఉండగా, అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నానని ప్రకటించారు. “గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నునొప్పి సమస్య తలెత్తింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరిగింది. అయితే అది అశ్రద్ధ చేయడంతో మళ్లీ వెన్నునొప్పి బాధించడం మొదలు పెట్టింది. దీంతో గత మూడు రోజులుగా బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను. రౌండ్ టేబుల్ సమావేశంకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున , నా తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. డాక్టర్స్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చినప్పటికి, సంప్రదాయ వైద్యంపై ఉన్న నమ్మకంతో ఆ దిశగా వెళుతున్నాను” అని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుతం సర్జరీ చేయించుకోవడం కంటే ప్రకృతి వైద్యమే మేలని పవన్ నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది. అందుకే వెంటనే ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఈ చికిత్సకు ఎక్కువ సమయమే పడుతుందని చెబుతున్నారు పవన్ సన్నిహితులు. అందుకే కొన్ని రోజుల పాటు ఆయన ఎక్కడా బయటికి రాడని.. ఇంట్లోనే ఉండి బెస్ రెస్ట్ తీసుకుంటాడని తెలుస్తుంది. జనసేన పార్టీ పనులు కూడా సభ్యులే చూసుకోనున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
previous post