నేటితో ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది..గత 20 రోజులుగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్షోలతో హోరెత్తిన మైకులు సాయంత్రంకు మూగబోనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు చివరి రోజు కాస్త వేడి వేడిగా ప్రసంగాలు చేస్తున్నారు. మొదటిసారి ఎన్నికల బరిలో నిల్చున్న జనసేన పార్టీ..ఈ ఎన్నికల ప్రచారం లో పవన్ తనదయిన స్టయిల్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
చివరి రోజు మరో మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన ప్రచారంలో పాల్గొని అందరిలో ఉత్సహం నింపాడు. ఇప్పటికే వరుణ్ తేజ్, నిహారిక లు జనసేన ప్రచారంలో పాల్గొని బాబాయ్, నాన్నకు సపోర్ట్ ఇవ్వగా..ఈరోజు బన్నీ కూడా తన వంతు సపోర్ట్ ఇచ్చాడు. ఈరోజు పాలకొల్లులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారని, జనసేన పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చినట్టు అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.