నరేంద్రమోదీ.. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే చేయబోయే విదేశీ పర్యటనలు కూడా దాదాపు ఖరారయ్యాయి. తొలి పర్యటనగా మాల్దీవులకు వెళ్లనున్న మోదీ.. ఈ ఏడాది ఇద్దరు అగ్రదేశాల అధినేతలను కూడా కలవనున్నారట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో ఆయన రెండు సార్లు ద్వైపాక్షిక భేటీలో పాల్గొనే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరులో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకానున్న మోదీ.. ట్రంప్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే జూన్ 28,29న జపాన్లో జరగబోయే జి-20 సదస్సులోనూ వీరిద్దరూ సమావేశం కానున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీని అభినందించేందుకు ఇటీవల ట్రంప్ స్వయంగా ఫోన్ చేశారు. ఆ సమయంలో సమావేశంపై ఇరువురు అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధికారిక కార్యాలయం శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అక్టోబరులో భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. అక్టోబరు 11న మోదీతో జిన్పింగ్ అనధికారిక భేటీలో పాల్గొనే అవకాశముందని సదరు వర్గాలు చెబుతున్నాయి. దీని కంటే ముందే జూన్ 13,14న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యే మోదీ.. జిన్పింగ్లో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.