ప్రతి రూపాయి ప్రజలకు అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శాసనసభలో ఈరోజు ఆమె మాట్లాడుతూ పేదల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి అసెంబ్లీ ఇదేనని రోజా ప్రశంసించారు. గత ఐదేళ్లుగా అప్రాప్రియేషన్ బిల్లు పెట్టి పాస్ చేసుకోవడాన్ని చూశామని చెప్పారు.
కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్రాప్రియేషన్ బిల్లు విభిన్నమైందని అన్నారు. ఈ బిల్లు ద్వారా ప్రతి రూపాయి ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాజన్న రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారన్నారు. ఇప్పుడు, సీఎం జగన్ యాభై రోజుల పాలన చూసిన తర్వాత రాజన్న రాజ్యం వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.