సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా మంచి విజయాన్ని సాధిస్తుండటంతో ప్రస్తుతం ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న చిరు తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ చిత్రం తెరకెక్కనుండగా, ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారట. రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్రత్యేక సెట్ కూడా రూపొందించినట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్లోనే చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. కమర్షియల్ అంశాలతో కూడిన సోషల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రంలో చరణ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.
previous post