కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు విచారించిన అనంతరం ఆయనను నిన్న అరెస్టు చేశారు. డీకే శివకుమార్ అరెస్టును నిరసిస్తూ బుధవారం కర్ణాటక బంద్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోన్న బంద్ హింసాత్మకంగా మారింది. కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించారు. వాహనాలపై దాడి చేశారు. ఒక్క వాహనాన్ని కూడా ముందుకు కదలనివ్వడం లేదు. రహదారులకు అడ్డంగా టైర్లు వేసి మంటలు పెట్టారు.
ఇక కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కళాశాలలు, పాఠశాలలు మూసివేశారు. ప్రయివేటు సంస్థలను బలవంతంగా మూసివేయిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇక డీకే శివకుమార్ను ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు మెడికల్ రిపోర్టులో నివేదించినట్లు సమాచారం.