మానవ జీవితంలో అంతులేని ఆనందాన్ని ఇచ్చేవి, అనూహ్యమైన అనుభూతిని కలిగించేదవి నిస్సందేహంగా లలిత కళలే. మానవ వికాసంలో లలిత కళలు నిర్వహించిన పాత్రం అమోఘం, అద్వితీయం. ఇప్పుడు ఆ కళలకు వన్నె తెచ్చింది పార్టికల్ ఆర్ట్. దీన్నే ఆర్ట్ త్రు పార్టికల్స్ అని కూడా అంటారు. ఈ కళలో జగత్ ప్రసిద్ధుడైన కళాకారుడు కాంత్ రిసా మన తెలుగువాడు కావడం మన అందరికీ గర్వకారణం. ఇసుకతో అద్భుతాలను సృష్టించే ప్రతిభ, ప్రావిణ్యం కలిగిన సృజనాత్మక కళాకారుడు కాంతి రిసా ప్రపంచంలో ఈ కళకు ఆద్యుడు, ఆరాధ్యుడు నిస్సందేహంగా కాంతి రిసానే క్షణాల్లో అతను అద్భుతాలను సృష్టించగలడు. వాటిని మన కళ్ళు సంబ్రమాశ్చర్యాలతో అలాగే చూస్తుంటాయి. మెరుపు వేగంతో … అక్షరాలను అలవోకగా … బొమ్మలను .. అనూహ్యంగా తన చేతి వేళ్ళ కొసలతో చిత్రించగల కళాకారుడు.
ఏ కాన్సెప్ట్ నయినా అక్షరాలు, బొమ్మలతో ఓ కథలా చెప్పడడం కాంత్ రిసా ప్రత్యేకత. ఇప్పటికే అతని ప్రతిభ తెలుగునాట ప్రతి నోటా వినిపిస్తుంది. ఆమధ్య కళా తపస్వి కె విశ్వనాథ్ ఎదుట కాంత్ రిసా తన విద్యను ప్రదర్శించాడు. విశ్వనాధ్ తన కాళ్ళని నమ్మలేకపోయాడు. ఆయన మనసు ఆనందంతో పొంగిపోయింది. అనూహ్యంగా విశ్వనాధ్కాంత్ రిసా పాదాలకు నమస్కరించారు. సభ మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఇది చాలు కాంత్ రిసా ఎంత గొప్ప సృజనాత్మక కళాకారుడో చెప్పడానికి. రెండు రోజులక్రితం హైదరాబాద్లోని నిర్మాతల మండలి హాలులో “లవ్ 2020 “సినిమా లోగో ఆవిష్కరణ జరిగింది.
మిత్రుడు మోహన్ వడ్లపట్ల ఆహ్వానిస్తే నేను కూడా ఈ సభలో పాల్గొన్నాను. మీడియా ముందు ఈ చిత్ర లోగోను క్షణాల్లో చిత్రించిన ప్రతిభా శాలి, ప్రభావ శీలి కాంతి రిసా. అప్పుడు అతని సామర్ధ్యం, కళాకారుడిగా ఎంత ఉన్నత స్థానంలో వున్నాడో ప్రత్యక్షంగా చూశాను. ఈ యువ కళాకారుడు సామాన్యంగా కనిపించే అసామాన్యుడు. అనితర సాధ్యుడు కాంత్ రిసా కు గొప్ప భవిష్యత్తు ఉంది.
-భగీరథ