నేటి(ఏప్రిల్ 2) ప్రాధాన్యత ఏమిటో క్రికెట్ అభిమానులకు బాగానే గుర్తుండి ఉంటుంది. భారత క్రికెట్ అభిమానులు దాదాపు 28 సంవత్సరాలు ఎదురుచూసిన ప్రపంచకప్ కల సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం, ఇదే రోజున నెరవేరింది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ప్రపంచకప్ బరిలోకి దిగిన టీం ఇండియా ఫైనల్స్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి రెండోసారి ప్రపంచకప్ని ముద్దాడింది. 2011, ఏప్రిల్ 2వ తేదీ.. వేదిక వాంఖడే స్టేడియం.. టోర్నమెంట్ ఆరంభం నుంచి అద్భుతమైన ఫాంతో విజయాలు సాధించి శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. సర్వత్ర ఉత్కంఠ. అభిమానుల్లో, ఆటగాళ్లలో టెన్షన్. కానీ, ఇరు జట్ల కెప్టెన్లు.. కుమార సంగక్కరా, ఎంఎస్ ధోనీ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు. తమ జట్టుకు విజయాన్ని అందించేందుకు వ్యూహాలు రచించుకొని సిద్ధంగా ఉన్నారు.
మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. లంక బ్యాటింగ్లో మహేలా జయవర్ధనే 103 పరుగులు, సంగక్కరా 48 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. సెహ్వాగ్(0), సచిన్ టెండూల్కర్(18) వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెలరేగిపోయాడు. లంక బౌలింగ్కి ధీటుగా సమాధానం చెబుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 97 పరుగులు చేసి ఔటై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, గంభీర్ వికెట్ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ధోనీ ఇక జట్టును గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. చివరి 11 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోనీ తన మార్క్ హెలికాఫ్టర్ షాట్తో సిక్సు బాదాడు. అంతే.. స్టేడియం అంత ఒక్కసారిగా హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది. కొన్ని కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులు చిరకాల కల నెరవేరింది.
1983 తర్వాత టీం ఇండియా రెండోసారి ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్పుని ముద్దాడింది. నాలుగు ప్రపంచకప్ టోర్నమెంట్ల నుంచి ఎదురుచూస్తూ వచ్చిన టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కల సాకారమైంది. అయితే ఓటమిలోనూ శ్రీలంక కెప్టెన్ సంగక్కర చిరునవ్వతో ఉండటం ఈ మ్యాచ్కి కొసమెరుపు. అయితే ఈ అపూర్వ ఘటన జరిగి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తికావడంతో క్రికెట్ అభిమానులు సోషల్మీడియాలో ఆ మధురస్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాక, ఈ ఏడాది జరిగే ప్రపంచకప్లోనూ భారత్ మరోసారి ప్రపంచకప్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.