బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా తనదైన కామెడీతో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు కిరాక్ ఆర్పీ. తాజాగా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఓ సినిమాకి ఆర్పీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్ చేస్తున్నాడు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్పై కోవూరు అరుణాచలం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తితో పాటుగా ప్రకాష్ రాజ్, రావు రమేశ్, జబర్దస్త్ ఆదిత్య తదితరులు నటిస్తున్నారు. త్వరలో సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు. పద్మజ పిక్చర్స్ ఆఫీసులో ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి నాగబాబుతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. “ఇన్ని రోజులు జబర్దస్త్ లో కమెడియన్ గా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. ఇప్పుడు దర్శకుడిగా కూడా అంతే ఆదరిస్తారని భావిస్తున్నాను. ఇక నా మీద నమ్మకంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇక ఇందులో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది” అని వెల్లడించాడు.
next post