విశాఖ ప్రాంగణం గీతం యూనివర్సిటీ నూతన వైస్ చాన్సలర్గా ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ నియమితులయ్యారు. బుధవారం వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను గీతం అధ్యక్షులు ఎం.శ్రీభరత్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు, కార్యదర్శి బీవీ మోహన్రావు, సంయుక్త కార్యదర్శి ఎం.భరద్వాజ్, రిజిస్ర్టార్ కేవీజీడీ బాలాజీ, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభినందించారు. మేనేజ్మెంట్ విద్యలో 33 సంవత్సరాల సుదీర్ఘ బోధన, పరిశోధన అనుభవం గల శివరామకృష్ణ ప్రస్తుతం గీతం విశాఖ ప్రాంగణం ప్రొ వైస్ చాన్సలర్గా వ్యవహరిస్తున్నారు.
యూజీసీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించి వివిధ కమిటీల్లో నిపుణులుగా వ్యవహరించిన ఆయన ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవల్పమెంట్ విశాఖ శాఖ చైర్మన్గా వ్యవహరించారు. 2017లో దివాస్ మెహతా జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం సమర్థ మానవ వనరులను దేశానికి అందించడానికి తగిన ప్రణాళికలు వీసీ రూపొందించాలని గీతం అధ్యక్షులు శ్రీభరత్ ఈ సందర్భంగా సూచించారు.