గత కొన్ని రోజులుగా బెల్లంకొండ గణేష్ ఆరంగేట్రంకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన బెల్లంకొండ సురేష్ తన చిన్న కుమారుడు సాయి గణేష్ వెండితెర ఆరంగేట్రం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అక్టోబర్ 5, ఉదయం 8గం.లకి అన్నపూర్ణ స్టూడియోలో గణేష్ మూవీ లాంచ్ కానుంది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రకటనతో గణేష్ లుక్ కూడా రివీల్ చేశారు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది . పక్కా లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే బెల్లంకొండ ఫ్యామిలీ నుండి శ్రీనివాస్ 2014లో వెండితెరకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. అల్లుడు శీను చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన శ్రీనివాస్ ఇటీవల విడుదలైన “రాక్షసుడు” చిత్రం మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.