కాలం గడిచే కొద్దీ ఎవరికైనా వయసు మీదపడుతుంది.. అది ఆయా వయసు ఛాయలతో ఎదుటివారికి కనిపిస్తూనే ఉంటుంది. అయితే చరిత్రలో రాజులు ఎన్నో ఏళ్ళు యవ్వనంగానే ఉండేవారు. దానికి కారణం వారు తీసుకునే ఆహారం. అయితే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం ఎంత సత్తువ లేనిదో అందరికి తెలిసిందే. కానీ, గతంలో పెద్దలు తిన్న ఆహారమే మనము తీసుకోవడం వలన ఆరోగ్యంతో పాటుగా నిత్యయవ్వనంతో కూడా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి ఆహారాలలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి పెసలు. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిని మొలకల రూపంలో తీసుకుంటే తద్వారా శరీరానికి కావాల్సిన ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు మరింత ఎక్కువగా లభిస్తాయి. అందుకే వీటిని చాలా మంది మొలకెత్తిన విత్తనాల రూపంలో తింటుంటారు. మొలకలను ఎలా తిన్నా సరే కాలేయం, జుట్టు, కళ్లు బాగా పని చేస్తాయట. క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా ఉండడంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది, ఫలితంగా ఊబకాయం సమస్య నుండి దూరంగా ఉండవచ్చు.
పెసళ్ళను క్రమం తప్పకుండా తినేవాళ్ళు తమ వయస్సు కన్నా పదేళ్ళు తక్కువగా కనిపిస్తారని పరిశోధనలలో తేలింది. ఎందుకంటే వీటిలో అధిక కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందట. అజీర్తి, జీర్ణవ్యవస్ధ సమస్యతో బాధపడేవారికి పెసళ్ళు మందులా పని చేస్తాయట. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందట. ఇందులోని కాల్షియం ఎముకల పటిష్టతకు దోహదపడుతుందట. అంతే కాదు సోడియం దంతాలు, చిగుళ్ళ సమస్యలను నివారిస్తుందట.