ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ 12వ మ్యాచ్ కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో బంగ్లాదేశ్తో తలపడిన ఇంగ్లండ్ 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో షకిబ్ అల్ హసన్ (119 బంతుల్లో 121 పరుగులు, 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ సాధించాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ముష్ఫికుర్ రహీం (50 బంతుల్లో 44 పరుగులు, 2 ఫోర్లు) కూడా తన వంతు సహకారం అందించాడు. అయినప్పటికీ బంగ్లా జట్టు ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండడంతో ఆ జట్టు పరుగుల వేటలో వెనుకబడి ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు. ప్లంకెట్, రషీద్లకు చెరో వికెట్ దక్కింది.
టాస్ ఓడినా, ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. దీనితో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జాసన్ రాయ్ (121 బంతుల్లో 153 పరుగులు, 14 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే జాస్ బట్లర్ (44 బంతుల్లో 64 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), జానీ బెయిర్స్టో (50 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు)లు అర్ధ సెంచరీలు చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్లకు చెరో 2 వికెట్లు దక్కగా, కెప్టెన్ మష్రఫె మొర్తాజా, ముస్తాఫిజుర్ రహమాన్లకు చెరొక వికెట్ దక్కింది. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది.