నేరం జరిగే విధానం కనిపించకుండా లక్షల్లో కొల్లగొట్టడం సైబర్ నేరగాళ్ల ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు గణనీయంగా పెరిగాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్కు ప్రతి రోజూ గరిష్టంగా 20 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సైబర్ సేఫ్ సిటీ’ కోసం అధికారులు అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు.
‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్’ అనే నానుడి ఆధారంగా ముందుకుపోతున్నారు. ఇటీవల ఎక్కువగా నమోదవుతున్న నేరాలు అకౌంట్ టేకోవర్కు సంబంధించినవే. సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈ-మెయిల్స్ను హ్యాక్ చేస్తారు. ప్రధానంగా అన్ సెక్యూర్డ్ ఈ-మెయిల్ ఐడీలను ఎంపిక చేసుకుని లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. ఆపై అదును చూసుకుని నగదు చెల్లించాల్సిన వ్యక్తికి దానిని తీసుకునే వ్యక్తి పంపినట్లు మెయిల్ పంపిస్తూ.. అందులో బ్యాంక్ ఖాతా మారిందంటూ తమది పొందుపరుస్తారు.
దానితో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకి వచ్చిపడతాయి. నగదు చెల్లింపులు జరిపే సందర్భాల్లో ఖాతాలు మారినట్లు సమాచారం అందితే నేరుగా సంప్రదించి నిర్థారించుకున్న తర్వాతే డిపాజిట్ చేస్తే ఉత్తమం. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో సర్వే ల పేరుతో చేతిలో డబ్బాలు పట్టుకొని నిలబడే వారు కనిపిస్తుంటారు. వారిచ్చిన కాగితంలో ఈ-మెయిల్ ఐడీ, సెల్ఫోన్ నెంబరు రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహుమతి అందిస్తామని చెబుతుంటారు. వీటికి ఆశపడి ఎవరైనా వివరాలు రాసి అందిస్తే… ఇక అంతే మరి.
ఇలా సేకరించిన డేటాను కొందరు అనేక మందికి అమ్ముకుంటారు. సైబర్ నేరగాళ్లు సైతం వీటిని కొని తమ పని కానిస్తుంటారు. ఇంటర్నెట్లోనూ ఇలాంటి సర్వేలు కనిపిస్తుంటాయి. సైబర్ నేరాలకు బీజం ఇక్కడి నుంచే పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిచయం లేని వారికి వివరాలు అందించకూడదు. అలాగే అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్, ఎమ్ఎమ్మెస్లకు స్పందించకూడదు.