ఈ నెల 25 (ఆదివారం)న ఉదయం 10.15 నిమిషాలకు ఎస్వీఆర్ అభిమానుల సమక్షంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లిగూడెం యస్.వి.ఆర్. సర్కిల్, కె.యన్.రోడ్లో ఆవిష్కరించనున్నారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు వంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘికంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకుగాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. విశ్వనటచక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ ఆయన బిరుదులు.
ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జన్మించారు. కృష్ణాజిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు, ఏలూరు, వైజాగ్లో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో నటించారు. షేక్ స్పియర్ డ్రామాల్లో నటించిన అనుభవంతోనే సినీనటుడు అయ్యారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయన నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. 18 జూలై 1974లో పరమపదించారు.