ఒకే రోజు ఆర్బీఐ(రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంక్ ఖాతాదారుకుల మూడు తీపికబుర్లు అందించింది. ఒకటేమో వడ్డీ రేట్ల తగ్గింపు. ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరొకటేమో నెఫ్ట్/ఆర్టీజీఎస్ చార్జీల ఎత్తివేత. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మూడోదేమో ఏటీఎం చార్జీలు, ఫీజులకు సంబంధించి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) చార్జీలు, ఫీజులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ జూన్ 6న ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో ఏటీఎం చార్జీలు దిగిరావొచ్చు.
ఈ కమిటీకి హెడ్గా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో వ్యవహరిస్తారు. ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) 2018 జూన్ నెలలోనే ఏటీఎం చార్జీల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆర్బీఐని కోరింది. ఇకపోతే కొత్తగా ఏర్పాటు కానున్న కమిటీ తన తొలి మీటింగ్ తర్వాత రెండు నెలలలోగా ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పాలసీ సమీక్ష తర్వాత ఆర్బీఐ ఈ నిర్ణయాలు వెల్లడించింది.