కొత్తకారు అనగానే కాస్త జోరుమీద ఉంటారు. అయితే అదే చాలా సార్లు ప్రమాదాలకు దారితీస్తుంది. ఇక బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒళ్ళు దగ్గరపెట్టుకున్నా ప్రమాదాలు తప్పవు. అదే జరగటంతో .. ప్రముఖ యాంకర్, నటి రష్మి చిక్కుల్లో పడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ పాదచారిని ఢీకొనగా, అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో జరిగింది.
ఇటీవల రష్మి ఓ కొత్త కారు కొనుక్కుంది. ఆమె దానిలో వెళుతున్న వేళ, ప్రమాదవశాత్తూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొంది. ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరుగగా, గాయపడిన వ్యక్తిని దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్న విషయం తెలియాల్సివుంది.