నటి, దర్శకురాలు విజయ నిర్మల మరణించిన పది రోజులైన సందర్భంగా శనివారం ఉదయం హైదరాబాద్లోని సంధ్య కన్వెషనల్ సెంటర్లో దశదిన కార్యక్రమాన్ని ఆమె కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు “కళావాహిని కీ౹౹శే౹౹శ్రీమతి.డా.జి.విజయనిర్మల గారు 27.06.2019 న శివైక్యం చెందారు. శనివారం (06-07-2019) ఉదయం :11.00గంటలకు, సంధ్య కన్వెన్షన్, గచ్చిబౌలి, హైదరాబాద్ లో “దశదిన కర్మ మరియు సంతాపసభ” కావున తెలియపరచడమైనది” అంటూ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సంతాప సభ కోసం ఏర్పాట్లు చేస్తుండగా తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీప్రముఖులు, అభిమానులు హాజరవుతారని భావించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే అతిథులు అక్కడికి చేరుకోవడానికి ముందే టెంట్ కూలిపోవడంతో ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.