నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, తద్వారా రానున్న రెండు, మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిసాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావం కారణంగా నేడు పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
వర్షాలకు అనుకూలంగా ఉండే రుతుపవన ద్రోణి యథాతథ స్థితిలో కొనసాగుతోందని, ఇది అల్పపీడనంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని వల్ల మధ్య భారతదేశంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కోస్తాలో ఈ నెలాఖరు వరకు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.