ఏసీబీ అధికారులే ఆ తహశీల్ధార్ ను చూసి ఆశ్చర్యపోరు.. రెండేళ్ల క్రితం ఉత్తమ తహశీల్దార్గా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఆమె ఇంట్లో నోట్ల కట్టలు చూసి విస్తుపోయారు. బీరువాలు, కబోర్డులు, అల్మారాలు.. ఎక్కడ చూసినా రూ. 2000, రూ.500 నోట్ల కట్టలే. ఇక, ఆస్తులకు, బంగారు ఆభరణాలకు లెక్కేలేదు. ఆమె మరెవరో కాదు.. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసిల్దార్ లావణ్య. ఆన్లైన్లో పేరు నమోదుకు ఓ రైతు నుంచి 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందుర్గు వీఆర్వో అనంతయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రైతు నుంచి రూ.9 లక్షలు డిమాండ్ చేసిన అనంతయ్య.. అందులో రూ.5 లక్షలు తహశీల్దార్ లావణ్య వాటా అని వివరించాడు.
దీంతో అధికారులు లావణ్యను విచారించారు. అనంతయ్య చెప్పిన దాంట్లో నిజం లేదని, ఆ లంచంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. విశ్వసించని అధికారులు ఆమె ఇంట్లో తనిఖీ చేసి షాక్కు గురయ్యారు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. అడుగడుగునా గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. మూడు గంటల్లోనే ఏకంగా రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. వీఆర్వో అనంతయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్టు చెప్పిన పోలీసులు.. లావణ్యపైనా కేసులు నమోదు చేయనున్నట్టు చెప్పారు.